గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న ఆయన అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్ రాష్ట్రం మొహాలీ క్యాంపస్ లో ఆఫ్ లైన్ తరగతులకు వెళ్తున్నారు. ప్రస్తుతం మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగడంతో వెంటనే మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడి వైద్యులు వంశీకి పలు పరీక్షలు నిర్వహించి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చూసించారు. అయితే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ తరువాత వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్నారు. అప్పటి నుంచి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల ఆయన వార్తల్లో నిలిచారు. గత వారం రోజుల క్రితం సొంత పార్టీ నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.