Site icon HashtagU Telugu

Uttarakhand Avalanche: 55 మంది కార్మికులలో 33 మంది సేఫ్‌.. 22 మంది కోసం అన్వేషణ!

Uttarakhand Avalanche

Uttarakhand Avalanche

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని మనా సమీపంలో శుక్రవారం భారీ హిమపాతం (Uttarakhand Avalanche) సంభవించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో పనిచేస్తున్న కనీసం 55 మంది కార్మికులు చిక్కుకున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో బిఆర్‌ఓ సిబ్బంది నిమగ్నమై ఉన్న భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని ఎత్తైన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం 33 మంది కూలీలను రక్షించారు. సాయంత్రం 5 గంటల వరకు 33 మందిని సురక్షితంగా రక్షించినట్లు ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మిగిలిన 22 మందిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ధామ్‌కు 6 కిలోమీటర్ల దూరంలో హిమపాతంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీతో పాటు డీజీ ఐటీబీపీ, డీజీ ఎన్డీఆర్‌ఎఫ్‌తో మాట్లాడారు. హిమపాతంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), BRO, ఇతర రెస్క్యూ టీమ్‌లు ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలను చేపట్టేందుకు మోహరించినట్లు సీఎం ధామి ధృవీకరించారు. ప్రతికూల వాతావరణం, నిరంతర హిమపాతం కారణంగా అక్కడికక్కడే రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలు నిర్వహించడంలో ఇబ్బందులు వ‌స్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Also Read: South Africa Cricketer: దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కన్నుమూత‌!

బద్రీనాథ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో మనా అనేది ఇండో-టిబెట్ సరిహద్దులో ఉన్న చివరి గ్రామం. ఇది 3200 మీటర్ల ఎత్తులో ఉంది. హిమపాతం కారణంగా ప్రమాదం జరిగిన ప్రదేశం శీతాకాలంలో ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ముందుగా ప్రజలను ఈ శిబిరం నుండి తొలగించి బద్రీనాథ్‌లో ఉంచారు. ఈసారి మంచు కురవడంతో క్యాంపును మూసివేయలేదని, దాంతో కార్మికులు ప్రమాదానికి గురయ్యారని మన గ్రామ అధిపతి పితాంబర్ సింగ్ పిటిఐకి తెలిపారు. బద్రీనాథ్‌ధామ్ నార్, నారాయణ్ పర్వతాల దిగువన ఉంది. దీని మధ్యలో అలకనంద నది ప్రవహిస్తుంది.