Site icon HashtagU Telugu

UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన UPSC

UPSC Civil Services

upsc interview schedule

UPSC: సివిల్ సర్వీసెస్ -2023 మెయిన్ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ ఇటీవలే విడుదల చేసింది. తాజాగా యూపీఎస్సీ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల షెడ్యూల్ ను ప్రకటించింది. అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్ ఇటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల రోల్ నంబర్, ఇటర్వ్యూ తేదీ, సమయంతో ప్రత్యేక షెడ్యూల్ ను రూపొందిచింది.

యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు మొత్తంగా 2844 మంది అర్హత సాధించగా.. తొలుత 1026 మంది అభ్యర్థులకు సంబంధించి ఇంటర్వ్యూల షెడ్యూల్ ను విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల ఇంటర్వ్యూ షెడ్యూల్ ను మరోసారి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన 1026 మంది అభ్యర్థులకు త్వరలోనే ఈ-కాల్ లెటర్లు వెబ్ సైట్ లో ఉంచుతామని యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్వ్యూలకు నిర్ణయించిన తేదీలు, సమయాల్లో మార్పులు చేయాలన్న అభ్యర్థనలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అలాగే ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులను ఇస్తామని, ట్రైన్స్ లో సెకండ్, స్లీపర్ తరగతుల ప్రయాణానికి మాత్రమే డబ్బు చెల్లిస్తామని తెలిపింది.

కాగా.. గత మే నెలలో జరిగిన యూపీఎస్సీ సివిల్స్ ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. 5.5 లక్షల మంది హాజరయ్యారు. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్ 15 నుంచి 24వ తేదీ వరకూ మెయిన్ పరీక్షలు నిర్వహించి.. డిసెంబర్ 8న ఫలితాలను విడుదల చేసింది. యూపీఎస్సీకి అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 90 మంది వరకూ ఉన్నట్లు సమాచారం.