Car Accident : నిజామాబాద్ జిల్లాలో ట్ర‌క్కును ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 11:07 AM IST

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. వేల్పూర్ చౌరస్తా సమీపంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారు ట్ర‌క్కును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారిద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అయితే అప్పటికి కారు పూర్తిగా దగ్ధమైంది.. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కాలిపోయారు. కారు కోరుట్ల నుంచి ఆర్మూర్‌కు వెళ్తోందని పోలీసులు తెలిపారు. వాహనం చెడిపోవడంతో ట్రక్కును డ్రైవర్ నిర్లక్ష్యంగా పార్క్ చేశాడని పోలీసులు తెలిపారు. కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా పోలీసులు మృతుడిని గుర్తించారు. కాలిపోయిన సుమంత్‌, అనిల్‌ మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇదిలా ఉండగా టిఎస్‌ఆర్‌టిసీ బస్సు ఆదివారం అర్థరాత్రి మహబూబ్‌నగర్ జిల్లాలోని హైదరాబాద్-బెంగళూరు హైవేపై వాహనం మంటల్లో చిక్కుకుంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన 16 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లగ్జరీ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం దివిటిపల్లి సమీపంలో దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపి, బస్సు మొత్తం మంటలు వ్యాపించకముందే ప్రయాణికులంతా దిగిపోయారు.