Two Indian Army: జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం నదిలో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు (Two Indian Army) కొట్టుకుపోయారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. వీరిలో ఒక సైనికుడిని నాయబ్ సుబేదార్ కులదీప్ సింగ్గా గుర్తించారు. మరో జవాన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఆర్మీకి చెందిన 16 కార్ప్స్ కమాండింగ్ ఆఫీసర్, సైనికులు కుల్దీప్ సింగ్కు నివాళులర్పించారు. నాయబ్ సుబేదార్ కులదీప్ సింగ్ అత్యున్నత త్యాగానికి వైట్ నైట్ కార్ప్స్ కమాండర్, అన్ని ర్యాంక్లు వందనం అని 16 కార్ప్స్ ట్విట్టర్ పేజీలో వ్రాయబడింది.
ఆకస్మిక వరద
ఈ సైనికులు పూంచ్లోని సూరంకోట్లోని పోషణ వద్ద డోగ్రా నాలాను దాటుతున్నారని, అయితే భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వారు బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని ఆర్మీ అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. శనివారం సాయంత్రం ఆర్మీ, పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంయుక్త బృందాలు ఇద్దరి కోసం వెతుకుతున్నాయని, అయితే ఏమీ కనుగొనబడలేదఐ తెలిపింది. సీనియర్ ఆర్మీ, పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా ప్రజలు నదులు/డ్రెయిన్లకు దూరంగా ఉండాలని సూచిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలు తిరుగుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షం
జమ్మూకశ్మీర్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం వరుసగా రెండో రోజు అమర్నాథ్ యాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. రాంబన్ జిల్లాలో 270 కిలోమీటర్ల పొడవైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగంలో నీరు ప్రవహించడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు.