హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆయా ప్రధాన ఆలయాల్లో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆంజనేయుడి జన్మస్థానంగా పేరొందిన తిరుమలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆకాశగంగలో అంజనాదేవి, బాలాంజనేయస్వామివారికి జరిగిన అభిషేకంలో ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం జపాలి తీర్థంలోని ఆంజనేయస్వామికి ఈవో పట్టువస్త్రాలు సమర్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమ జన్మస్థానమైన ఆకాశగంగ తీర్థంలోని బాలాంజనేయస్వామివారికి ఐదు రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో చెప్పారు.