ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎనిమిదేళ్ల పాలనలో మోడీ సర్కార్ అమలు చేసిన సంస్కరణలు ప్రజలను, కార్మికులను మోసం చేసేలా ఉన్నాయని ఖాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని మోదీ విఫలం అయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కవిత గుర్తు చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం మోడీ చేస్తోన్న ప్రజా వ్యతిరేక సంస్కరణలపై పోరాడుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కూలీల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తూ.. ప్రభుత్వం కూలీలకు అండగా నిలుస్తోందని కవిత పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం టిఎస్ఆర్టిసికి సంవత్సరానికి రూ. 1,000 గ్రాంట్ నిధులు కేటాయించడం, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 25,000 మంది ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం వంటి అనేక చర్యలు కేసీఆర్ సర్కార్ తీసుకుందని కితాబిచ్చారు.