కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ కొడుకు గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో జరిగింది. అనారోగ్యంతో తల్లి మృతి చెందగా, తల్లి మరణాన్ని తట్టుకోలేని కొడుకు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో విస్సన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఎదురుగా టైలర్గా పని చేస్తున్న వీరబాబు తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వీరబాబు తల్లి శుక్రవారం ఉదయం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బ్రెయిన్ స్ట్రోక్తో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లి మరణవార్త విన్న వీరబాబు ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తల్లి మరణించిన 24 గంటల్లో కుమారుడు మృతి చెందాడు. 24 గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో విస్సన్నపేట గ్రామంలో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.