Toy Train Derail : చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది. టాయ్ ట్రైన్ మహారాష్ట్రలోని మాథేరన్ హిల్ స్టేషన్ నుంచి నేరల్కు వెళ్తుండగా.. ముంబైకి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుమ్మా పట్టి స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజన్ చక్రాలలో ఒకటి పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన టైంలో టాయ్ ట్రైన్లో(Toy Train Derail) 95 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు రైలు దిగి క్యాబ్లలో తమ గమ్యస్థానాలకు వెళ్లారని రైల్వే అధికారులు తెలిపారు.
Also read : టాయ్ ట్రైన్.. మళ్లీ వచ్చేస్తుదండీ..!
వర్షాకాలంలో నేరల్ – మాథేరన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ సర్వీస్ నిలిపివేస్తామని సీనియర్ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ టాయ్ ట్రైన్ పర్వత రైల్వే సర్వీసుల్లో ఒకటి. 21 కిలోమీటర్ల పొడవు గల నేరల్- మాథేరన్ నారో గేజ్ ట్రాక్.. మాథేరన్ హిల్ స్టేషన్ యొక్క సుందరమైన ఘాట్ మీదుగా వెళ్తుంది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలంలో భద్రతా కారణాల దృష్ట్యా నేరల్ – మాథేరన్ మధ్య టాయ్ ట్రైన్ సర్వీసును నిలిపివేస్తుంటారు.కానీ మాథేరన్ – అమన్ లాడ్జ్ మధ్య సర్వీస్ ఏడాది పొడవునా కొనసాగుతూనే ఉంటుంది.