విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సోమన్నపేటలో విషాదం నెలకొంది. గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. గ్రామానికి చెందిన రామినాయుడు, భవన నిర్మాణ కార్మికులు పి.కేసరి (22), జి. చంద్రశేఖర్ (18)తో కలిసి పనిలో నిమగ్నమై ఉండగా వారు పట్టుకున్న ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఇద్దరు కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. వారిని కాపాడే ప్రయత్నంలో పక్కనే ఉన్న అంగన్వాడీ ఆయా రియామ్మ(57) కూడా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.