అధికారంలో ఉన్న అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంపై దాడి చేసి ఆక్రమించుకున్న తాలిబాన్లు సైతం రష్యాను శాంతిగా ఉండమంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో 20 వేల మంది గెరిల్లా ఆర్మీని పంపేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది.
రష్యా తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం పై తాలిబన్లు సైతం స్పందించారు. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్దాన్ని శాంతితో ముగించాలంటూ తాలిబాన్లు స్టేట్మెంట్ విడుదల చేశారు.
ఈ యుద్ధం కారణంగా చాలా ప్రాణ నష్టం జరుగుతుందని తాలిబన్లు ఆ స్టేట్మెంట్ ద్వారా తెలిపారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ ఉక్రెయిన్లో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తుందని, చాలా మంది అమాయక పౌరుల ప్రాణ నష్టం జరుగుతుందని, దీంతో ఇరు వర్గాలు శాంతితో కూడిన చర్చలు చేసుకుని యుద్ధాన్ని ముగించాలని, హింసను వీడాలి అంటూ తాలిబన్లు పేర్కొన్నారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ విదేశీ విధానంతో తటస్థంగా ఉందని స్పష్టం చేసింది. కాగా 2021 ఆగష్టు 15న తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్ హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.