TS Govt: ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో

రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సూచించిన సీఎస్ జిల్లాల పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలు లో నిమగ్నం చేయాలన్నారు. జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

తమ జిల్లాలో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతోవెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని, గత యాసంగి లో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు గానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్న సీఎస్ గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలని, దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.

క్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధర గా నిర్ణయించడం జరిగిందని, వ్యవసాయవిస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలు లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించిన అధికారులు తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏవిధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలని కింది స్థాయి అధికారులకు తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలని, ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలని, పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.