Study Visa Fee Hike : బ్రిటన్ ప్రభుత్వం ఇండియా స్టూడెంట్స్ కు షాక్ ఇచ్చే నిర్ణయం ఒకటి తీసుకుంది. విదేశీ విద్యార్థుల నుంచి తీసుకునే స్టడీ వీసా ఫీజును భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.13వేలు (127 పౌండ్ల) మేర స్టడీ వీసా ఫీజును పెంచింది. ఈ పెంచిన ఫీజు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్రిటన్ సర్కారు తెలిపింది. దీనిపై ఇటీవల బ్రిటిష్ పార్లమెంట్లో చేసిన చట్టం అమలులో భాగంగానే భారత స్టూడెంట్స్ కు సంబంధించి వీసా ఫీజును పెంచారు. తాజాగా పెంచిన 127 పౌండ్లతో కలుపుకొని స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజు విలువ రూ.50వేలకు (490 పౌండ్లు) చేరింది. ఈవివరాలను బ్రిటన్ హోం ఆఫీసు కూడా ధ్రువీకరించింది.
ఇక దీంతోపాటు టూరిస్టులకు జారీ చేసే విజిటింగ్ వీసా ఫీజును కూడా ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రభుత్వం రూ.1600 (15 పౌండ్లు) మేర పెంచింది. ఈ పెంచిన మొత్తాన్ని కలుపుకొని విజిటింగ్ వీసా అప్లికేషన్ ఫీజు మొత్తం విలువ రూ.12వేలకు (115 పౌండ్లు) పెరిగింది. ఈ పెంపు అనేది 6 నెలల పరిమితి కలిగిన విజిట్ వీసాకు వర్తిస్తుందని బ్రిటన్ హోం ఆఫీసు స్పష్టం చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 1.20 లక్షల మంది విద్యాపరమైన అవసరాల కోసం(Study Visa Fee Hike) బ్రిటన్ కు వెళ్లారు.