‘‘తెలంగాణ అంటే టీడీపీ, టీడీపీ అంటే తెలంగాణ’’.. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడు.. తెలంగాణలో టీడీపీ ఎందుకు ఉండకూడదు? అని అంటున్నారు తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. రేపు ఆయన ఎన్టీఆర్ భవన్ లో నూతన టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా హ్యాష్ ట్యాగ్ యూ (Hashtag U)తో ముచ్చటించారు.
టీడీపీ తెలంగాణలో స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన కాసాని.. ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకుతీసుకెళ్తామని చెప్పారు. నేతలు పార్టీలు వీడినా.. క్యాడర్ పార్టీతోనే ఉన్నారని, వారితోనే అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళతామని అన్నారు. రాబోయే మూడు నెలల్లో తెలంగాణలో తమ పార్టీని బలమైన శక్తిగా మారుస్తామన్న జ్ఞానేశ్వర్.. హైదరాబాద్ ఇంతగా డెవలప్ అయ్యిందంటే చంద్రబాబునాయుడే కారణం అని అన్నారు. గ్రామగ్రామాన తిరిగి తెలుగుదేశం జెండాను తిరిగి స్ధాపిస్తానని, పార్టీని వీడిన నాయకులందరూ తెలుగుదేశంలో తిరిగి చేరాలని కోరారు.
Also Read: Modi Vizag Tour : విశాఖ పర్యటనకు ముందే `మోడీ`కి నిరసన సెగ
మంచి కంటే చెడు త్వరగా ప్రజల్లోకి వెళ్లుతుంది కాబట్టి, టీడీపీపై ఆంధ్రా పార్టీ ముద్ర వేశారని కాసాని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున పుట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కొందరు కావాలనే కుట్ర పూరితంగా టీడిపిపై ఆంధ్ర పార్టీ ముద్ర వేశారని ఆరోపించారు. గతంలో 93 కుల సంఘాల చైర్మన్ గా, పార్టీ స్థాపించిన అధినేతగా తనుకన్న అనుభవంతో తెలంగాణలో టీడీపీని ముందుకు తీసుకెళ్తానని అన్నారు.