Telangana Politics : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలలో గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) పార్టీలలో నేతల అసమ్మతి సెగలు రోజు రోజుకు భగ్గుమంటున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేతలు తమ నిరసన ను తెలియజేస్తూ వస్తున్నారు. టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు … టిక్కెట్ ఆశించిన వారు కూడా అధిష్టాన తీరు ఫై మండిపడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో సైలెంట్ గా ఉన్న వారంతా..వారం తర్వాత నుండి తమ నోటికి పనిచెపుతున్నారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తే..ఇప్పుడు పట్టించుకోరా..అని వారంతా వాపోతున్నారు.
ఒక నియోజకవర్గంలో కాదు చాల నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ప్రతి రోజు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. కుల సంఘాలతో మద్దతుగా ప్రకటనలు చేయిస్తున్నారు. దీనంతటికి కారణం కొన్ని మార్పులుంటాయని కేసీఆర్ చెప్పడమేనని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. బల ప్రదర్శన చేసి టిక్కెట్లు పొందాలనుకుంటున్నారని వారు అంటున్నారు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి (Narsapur MLA Chilumula Madan Reddy) కూడా టికెట్ ఆశించి భంగ పడ్డారు. ఈ స్థానం నుండి సునీత రెడ్డి (Sunitha Reddy)కి టికెట్ దక్కే అవకాశం ఉండడంతో పరోక్షంగా ఆమె పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు టికెట్ దక్కకపోతే నియోజకవర్గంలో పార్టీ ముక్కలైపోతుందని హెచ్చరిస్తున్నారు.
Read Also : Allu Arjun: అల్లు అర్జున్ సర్ప్రైజ్ వచ్చేసింది.. వీడియో వైరల్..!
పటాన్ చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy)కి మరోసారి టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో అసమ్మతి గళం పెరుగుతుంది. ఇదే టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు ముదిరాజ్… రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించారు. బీసీ సామాజికవర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చేలా కార్యచరణను సిద్ధం చేయటంతో పాటు బల ప్రదర్శలను చేపడుతున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ముదిరాజ్ సామాజికవర్గం ఓట్లు ఉన్న నేపథ్యంలో… తన సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు.
ఇక సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao) కు సైతం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం తో ఆయన కూడా అధిష్టానం ఫై కాస్త గుర్రుగానే ఉన్నారు. ఇప్పటికే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సమావేశాలు జరుపుతూ..కాంగ్రెస్ పార్టీ లో చేరాలనే ఒత్తిడి తెస్తున్నారు. మీడియా లోను తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు తుమ్మల..అధిష్టానం ఫై తన స్పందనను తెలియజేయనప్పటికీ..వెనుకాల మాత్రం తన రాజకీయ భవిష్యత్ ఫై అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.
Read Also :Hanuman In Female Avatar : ఆ ఆలయంలో స్త్రీ రూపంలో ఆంజనేయుడు.. మహిమాన్విత గాథ తెలుసుకోండి
ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి (MLA Bethi Subhash Reddy) టిక్కెట్ నిరాకరించిన తర్వాత ఇప్పటి వరకూ మాట్లాడలేదు. కానీ వారం అయినా కేసీఆర్ పిలిచి మాట్లాడలేదని.. ఒక్క సారిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తానే గ్రేటర్లో మొదటి ఉద్యమకారుడినని.. కానీ తనను బలిపశువును చేశారని ఆయనంటున్నారు. మేకపోతుని బలిచ్చే ముందు తనకు కనీసం మంచినీళ్లు తాగిస్తారని, అలాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఉరి తీసే ముందు తనకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారని తన విషయంలో అటువంటి చివరి అవకాశం కూడా పార్టీ అధినాయకత్వం ఇవ్వలేదని వాపోతున్నాడు. ఇక స్టేషన్ ఘాన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సైతం.. తన నిర్ణయం తాను తీసుకుంటానని కానీ తనకు ఇప్పటికీ చివరి నిమిషంలో టికెట్ వస్తుందన్న ఆశ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తిని అంచనా వేసేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) ట్రై చేస్తున్నారని..అంత చూసిన తర్వాత 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ను మార్చే అవకాశం ఉందని పార్టీలోని కొంతమంది అంటున్నారు. దీంతో బలప్రదర్శన చేసేందుకు నేతల తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక అధికార పార్టీ లో ఇలా ఉంటె..ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ (Congress ) లో మరో లొల్లి. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ లో నేతల మధ్య అభిప్రాయం భేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎవరికివారే యమునాతీరే అన్నట్లు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుంటారు. ఒకరు ఒక కామెంట్ చేస్తే మరొకరు ఆలా ఎలా అంటారు..అంటూ సొంత నేతపైనే విమర్శలు , ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఈరోజుది కాదు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నదే. కాకపోతే ఈ పదేళ్లలో ఎక్కువైంది..రేవంత్ టీపీసీసీ అయ్యాక మరి ఎక్కువైంది.
Read Also : Super Blue Moon : ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది..మిస్ కాకండి
రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ని అధికారంలో తీసుకరావాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంటే…ఇక్కడ పార్టీ నేతలు మాత్రం విజయం తర్వాత..ముందు మా మాటే నెగ్గాలి అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల నుండి అభ్యర్థుల పోటీ పిర్యాదులు స్వీకరించడం మొదలుపెట్టింది. దరఖాస్తుల పరిశీలన కోసం మంగళవారం గాంధీభవన్ (Gandhi Bhavan)లో జరిగిన ఎన్నికల కమిటీ భేటీ రచ్చ రచ్చ అయింది. సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.
సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు సీట్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (N. Uttam Kumar Reddy), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ (TPCC Working President Mahesh Kumar Goud) మధ్య రెండు సీట్ల అంశం చర్చకు వచ్చింది. కుటుంబానికి రెండు సీట్ల అంశం ఇపుడెందుకంటూ… ఉత్తమ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎవర్ని లక్ష్యంగా చేసుకొని సమావేశం జరుగుతోందంటూ..ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నియోజకవర్గం కోసం ఉత్తమ్ పద్మావతి దరఖాస్తులు సమర్పించారు. కోదాడ,హుజుర్ నగర్ స్థానాలకు… పోటీగా జార్జిరెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇదే ఉత్తమ్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది.
Read Also : Pawan Kalyan: పవన్ పై ఎన్నికల ఎఫెక్ట్, ఆ సినిమాల షూటింగ్స్ రద్దు చేసుకోవాల్సిందేనా!
ఇదే సమావేశంలో రెండు సీట్లపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ (Balaram Naik) ప్రస్తావించారు. ఏదో ఒకటి చెప్పాలని పీఈసీ సభ్యులను నిలదీసినట్లు తెలుస్తోంది. సర్వేలపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సీరియస్ అయ్యారు. అసలు సర్వే ఎలా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తున్నపుడు…ఈ ప్రక్రియ అంతా ఎందుకని ప్రశ్నించారు. కొన్ని నియోజకవర్గాలకు రెండే దరఖాస్తులు వస్తే… తమ నియోజకవర్గాలకు 20 దరఖాస్తులు ఎలా వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే సీనియర్ నేత వీహెచ్ (VH) కూడా తన వాదన బలంగానే వినిపించినట్లు తెలుస్తుంది. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారు? ఎక్కడ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఎన్ని టికెట్లు ఇస్తారో చెప్పాలని రేణుకా చౌదరి కోరారు. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ తనను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి (jaggareddy) కూడా ఫైరయ్యారు.మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. దరఖాస్తుల పరిశీలన కోసం భేటీ అయిన ఎన్నికల కమిటీ ఆ విషయాన్ని ఎటూ తేల్చకుండానే సమావేశాన్ని ముగించేసింది. సెప్టెంబర్ 2న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. మరోపక్క పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను ఆశిస్తున్న ఆ పార్టీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి.. తొర్రూరు మండలం చర్లపాలేనికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్రెడ్డి సతీమణి ఝాన్సీరెడ్డి వర్గీయుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుతుంది.
Read Also : DSC Candidates: కేసీఆర్ కు షాక్.. కామారెడ్డిలో బరిలో ‘ఢీ’ఎస్సీ అభ్యర్థులు
తొర్రూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఝాన్సీరెడ్డి నాయకత్వం వర్ధిలాలి, తిరుపతిరెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆరేండ్లుగా కాంగ్రెస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, కాంగ్రెస్ ఎన్నారై విభాగంలో కూడా ఝాన్సీరెడ్డికి సభ్యత్వం లేదని, పార్టీ కోసం ఏనాడూ పని చేయలేదని, పాలకుర్తి టికెట్ ఆశించడం సరికాదని తిరుపతిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఇలా ఒక దగ్గర కాదు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. మొత్తం మీద ఎన్నికల వేడి నేతల్లో మాత్రం ఆగ్రహపు జ్వాలలు రేపుతోంది. మరి ఎన్నికల సమయానికి ఎవరు..ఏ పార్టీ లోకి వెళ్తారో..? ఎవరికీ ఎవరు సపోర్ట్ ఇస్తారో..? ఏ పార్టీ లో ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి.