Site icon HashtagU Telugu

TS Governor Focus on Issues: తమిళిసై.. తగ్గేదేలే!

Tamilisai

Tamilisai

ప్రస్తుతం ఐఐఐటీ బాసర వివాదంతో అధికార పార్టీ టీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. క్యాంపస్‌లో సౌకర్యాలు లేవన్న ఆరోపణలు బయటకు వస్తున్న తీరు పెద్ద వివాదంగా మారుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి రావాలని కలలు కంటున్న నేపథ్యంలో బాసర అంశాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఆయనపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. బాసర ఇష్యూను తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. బాసర ఐఐఐటీ క్యాంపస్‌లో రాష్ట్రంలోని అధికార పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో గవర్నర్ ఐఐఐటీ క్యాంపస్‌లోకి ప్రవేశించి అక్కడ విద్యార్థులతో సమావేశమై, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలను గమనించిన గవర్నర్.. వాటిని పరిశీలించి పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ఆమె ముఖ్యమంత్రిని ఢీకొనేందుకు సిద్ధమయ్యాయని, అందుకోసం రాష్ట్రంలోని సమస్యలను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేందుకు ఆమె పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో వరదల సమయంలో, తమిళిసై సౌందరరాజన్ బాధితులను కలుసుకుని, వారికి సహాయం చేస్తామని హామీ ఇవ్వడం పెద్ద సంచలనం సృష్టించింది. తాజాగా బాసరను విజిట్ చేయడం కూడా టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం తమిళిసై పర్యటనలు చేయడమూ ఒక్క విధంగా మంచి చేస్తుందని సామాన్య పౌరులు పేర్కొంటున్నారు.