Site icon HashtagU Telugu

TCongress Action Plan: టీకాంగ్రెస్ ‘మునుగోడు’ ఆపరేషన్ షురూ!

Tcongress

Tcongress

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నికపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక పై గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ అధ్యక్షతన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం పైన నాయకులు చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ,  ఏఐసీసీ సెక్రటరీలు  బోస్ రాజు , నదీమ్ జావిద్ , చౌదరి , వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు  రాంరెడ్డి దామోదర్ రెడ్డి ,నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ , భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ , ఈరవత్రి అనీల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇప్పటికే చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 13 నుంచి మునుగోడులో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మధుయాష్కి పాల్గొననున్నారు. ఈ నెల 16న రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇక, ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జెండా వందనం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అలాగే అమిత్ షాతో బీజేపీ సభ నిర్వహించే రోజు.. గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలుపాలని ఆలోచనలు చేస్తోంది.