తెలంగాణ రాష్ట్రంలోని వెలమ సామాజికవర్గంపై తీన్మార్ మల్లన్న యుద్ధం ప్రకటించారు. కేవలం 7,200 మంది వెలమ దొంగలు రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని చింతపండు శ్రీను అలియాస్ మల్లన్న ఆరోపించారు. ఆ 7,200 మంది వెలమ దొరల భరతం పట్టడానికి కొత్త పార్టీ పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మల్లన్న టీమ్ 7200 పేరుతో తాను ఉద్యమం చేస్తున్నానని వివరించారు. తాను ఏర్పాటు చేసిన ఈ టీమ్ బీజేపీ కన్నా లక్ష రెట్లు మేలని చెప్పారు. ఇకపై జీవితంలో తాను బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు.
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని తీన్మార్ మల్లన్న అన్నారు. మరో 10 రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్తానని మల్లన్న ప్రకటించారు. తనపై, తన కుటుంబంపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి, రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. ఆస్తులను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరని గుర్తు చేశారు. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షల మందితో బహిరంగసభను నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 176 మంది చిన్నారులకు తమ టీమ్ గుండె చికిత్సలు చేయించిందని తెలిపారు.