యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైయ్యారు. అయితే కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అర్థరాత్రి ప్రత్యేక అంబులెన్స్లో ఆయన్ని బెంగుళూరుకు తరలించారు. నిన్న రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత తారకరత్నను బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. ఆ వెంటనే ప్రత్యేక అంబులెన్సులో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. రక్తపోటు సాధారణంగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి పర్యవేక్షిస్తున్నారు. తొలిరోజు పాదయాత్ర ముగిసిన తరువాత నారా లోకేష్ పీఈఎస్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.