Supreme Court : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం 4:3 మెజారిటీతో తీర్పును వెలువరించింది. ఎఎంయు కేంద్రీయ విశ్వవిద్యాలయమని, దానిని మైనారిటీ సంస్థగా పరిగణించలేమన్న 1967 నాటి తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. 2006 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు చెల్లుబాటును పరిశీలించేందుకు మరో బెంచ్ను ఏర్పాటు చేయనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
భారత రాజ్యాంగ ఆర్టికల్ 30 కింద మైనార్టీలకు ఉన్న ప్రత్యేక హక్కులు అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో వర్తిస్తాయని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఎఎంయు మైనారిటీ హోదా కేసులో రాజ్యాంగ ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఎస్.పి. శర్మలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పుని వ్యతిరేకించగా, మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ఖన్నా, జె.బి.పార్ధివాలా, మనోజ్ మిశ్రాలు ఆమోదించారు. గతంలో ఫిబ్రవరి 1న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. 1967లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఎఎంయు కేంద్రీయ విశ్వవిద్యాలయం కావున మైనారిటీ సంస్థగా పరిగణించలేమని తీర్పునిచ్చింది.
కాగా, మైనార్టీ హోదా సాధ్యం కాదు 1967లో తీర్పు 1875లో స్థాపితమైన అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా పునరుద్ధరణకు పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు, 2024 ఫిబ్రవరి 1న తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 2024 నవంబర్ 8 న తీర్పును వెలువరించింది. 1967లో సుప్రీం కోర్టు అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మైనార్టీ హోదా సాధ్యం కాదని ఇచ్చిన తీర్పును 4:3 మెజారిటీలో తిరస్కరించిందని ఈ కొత్త తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.