రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. మనుషులతో పాటు జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 గొర్రెలు చనిపోయాయి. జగిత్యాల జిల్లా సోమవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్లో వీధికుక్కల దాడిలో సుమారు 19 గొర్రెలు మృతి చెందగా, నాలుగు గాయపడిన ఘటన సంచలనం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి, యజమాని దానవేని మల్లయ్య ఆదివారం రాత్రి గొర్రెలను షెడ్డులో వదిలేశాడు. వీధి కుక్కల గుంపు మందపై దాడి చేసి 19 గొర్రెలను చంపాయి. విషయం తెలుసుకున్న మల్లయ్య పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచారం అందించగా, పశువైద్యాధికారి శ్రీనివాస్రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి గాయపడిన గొర్రెలకు చికిత్స అందించారు.