స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ ఆగష్టు 20న హైదరాబాద్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే BJP MLA రాజా సింగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రదర్శన చేస్తానని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ అభిమానులకు నిరాశను మిగిల్చింది. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఈరోజు (ఆగస్టు 19) జరగాల్సిన బెంగళూరు షో వాయిదా పడిందని శుక్రవారం మునవర్ ఫరూఖీ ప్రకటించాడు. ” హాయ్ దోస్టన్. ఈరోజు బెంగళూరు షో వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. ఆరోగ్య సమస్యల కారణంగా నేను నా ఫ్లైట్ను కోల్పోయాను. నన్ను క్షమించండి‘‘ అంటూ రియాక్ట్ అయ్యాడు. ఈ పరిణామం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మునావర్ షో ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నారు అభిమానులు.
గత వారం మునావర్ హైదరాబాద్ షోను ఆపాలని రాజా సింగ్ బెదిరించిన విషయం తెలిసిందే. నగరంలో ప్రదర్శన నిర్వహిస్తే థియేటర్కు నిప్పు పెడతానని వీడియో సందేశంలో పేర్కొన్నాడు. మునవర్ను కొడతానని బెదిరించాడు. కాగా గతంలో మంత్రి కేటీఆర్ పోలీసు రక్షణ కల్పించి, తన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఆహ్వానించారు. అయితే అప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఏకమై మునావర్ ను బెదిరించడంతో భయపడి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు.