రాజమౌళి మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టిక్కెట్ రేట్లను సవరించి కొత్త జీవోను జారీ చేసింది. దీంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సీఎం జగన్తో సమావేశమై టిక్కెట్ రేట్లు, స్పెషల్ షోలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
కొత్త జిఓ ప్రకారం రాష్ట్రంలో కనీసం 20% షూటింగ్ జరిగితేనే టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6000 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటి అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న రాజమౌళి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా బాగా రిసీవ్ చేసుకుని,మాట్లాడారని.. బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి ఆ సినిమాకి ఏమిచేయలో అది చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాజమౌళి తెలిపారు.