కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి బంగారు రథంపై తిరువీధుల్లో విహరించారు. స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథాన్ని లాగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు, సెలబ్రిటీలు తిరుమలకు క్యూ కడుతున్నారు. ఏకాదశి రోజున శ్రీవారిని సందర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ప్రముఖుల తాకిడి పెరిగింది. నెల్లూరులో పెన్నా తీరాన వెలిసిన తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో… శ్రీరామచంద్రుడు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు అభయమిచ్చారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.