One Nation One Election : ఇటీవలే పార్లమెంటు వర్షకాల సమావేశాలు ఎలా జరిగాయో దేశమంతా చూసింది..
మణిపూర్ పై లోక్ సభ, రాజ్యసభ ఎలా అట్టుడికాయో మనమంతా చూశాం.
ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ నిర్వహిస్తామని ప్రకటించింది.
అయితే అకస్మాత్తుగా పార్లమెంటు సమావేశాలకు ఎందుకు పిలుపునిచ్చారు ? కారణమేంటి ? అనే దానిపై సర్వత్రా డిస్కషన్ జరుగుతోంది.
ఈ పార్లమెంట్ సెషన్ పై ఒక్కొక్కరు ఒక్కో విధమైన విశ్లేషణ చెబుతున్నారు. ముందస్తు ఎన్నికల సన్నాహాల కోసమే ఈ సెషన్ ను నిర్వహిస్తున్నారని కొంతమంది చెబుతుంటే.. గత పార్లమెంట్ సెషన్ లో పెండింగ్ లో పడిపోయిన బిల్లులను ఆమోదించడానికే ఈ స్పెషల్ సెషన్ అని ఇంకొందరు వాదిస్తున్నారు. దేశంలో ప్రతీదీ ‘వన్ నేషన్’ ఎజెండాతో లింక్ అయి ఉండాలి.. కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం కనిపించాలి అనేది బీజేపీ ఎజెండా. దాన్ని చట్టపరంగా అమలుపరిచేందుకు అవసరమైన బాటలు వేసుకోవాలని మోడీ సర్కారు ప్లాన్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి ఐదు రోజుల పార్లమెంటు సమావేశాల్లో ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లును(One Nation One Election) ప్రవేశపెట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ బిల్లు పాస్ అయితే ‘మినీ జమిలి ఎన్నికలు’ జరిగే అవకాశం ఉంది. లోక్సభతో పాటు మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను ‘మినీ జమిలీ’ తరహాలో జరపాలన్న ఆలోచన కనిపిస్తోందనే విశ్లేషణ వినిపిిస్తోంది.
ఒకేసారి లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే వృధా ఖర్చులను నివారించవచ్చనే అంశాన్ని హైలైట్ చేస్తూ ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈక్రమంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముందే ముగుస్తుంది. అయితే దీనికి సమాధానం చెప్పేందుకు ఆర్టికల్ 172ను కేంద్రం వాడుకునే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచే అధికారం తమకు ఉందని కేంద్రం వాదించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐదేళ్ల కాలపరిమితి కంటే ముందస్తుగా రద్దయ్యే అసెంబ్లీలకు.. ఎన్నికల తర్వాత పాలనా కాలాన్ని పొడిగించే వెసులుబాటు ఉండొచ్చని పేర్కొంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహారాష్ట అసెంబ్లీని రద్దు చేసే యోచనలో బీజేపీ ఉందని చర్చ నడుస్తోంది. డిసెంబర్లోపు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 6 నెలల్లోనే లోక్ సభ ఎన్నికలతో పాటు కశ్మీర్ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. ఈ లెక్కన దాదాపు 11 రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు పోల్స్ ఎందుకు ? అన్నింటినీ ఒకేసారి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.