నిజామాబాద్లో దారుణం జరిగింది. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. తాగేందుకు మంచి నీళ్ల బాటిల్ అడిగిన ఓ కస్టమర్ కి ఆ షాపింగ్ మాల్ సిబ్బంది పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చేశారు. ఇది గ్రహించని కస్టమర్.. నీళ్లు అనుకుని బాటిల్ లోని యాసిడ్ తాగేశాడు.దీంతో ఆ కస్టమర్ ఆసుపత్రి పాలైయి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అలాగే షాపింగ్ మాల్ లో పనిచేసే వర్కర్ కూడా నీళ్లు అనుకుని యాసిడ్ తాగాడు. దీంతో వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిద్దరిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 29న పెళ్లి ఉండటంతో బాధితుడు విజయ్ షాపింగ్ చేసేందుకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి విజయ్ ప్రాణాల మీదకు తెచ్చిన షాపింగ్ మాల్ యాజమాన్యంపై బాధితుడి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.