Chicken Prices: ఏపీలో కొండెక్కిన ‘కోడి’

గత కొద్ది రోజులుగా పెరిగిన ధరల కారణంగా చికెన్ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది.

Published By: HashtagU Telugu Desk
Chiken

Chiken

గత కొద్ది రోజులుగా పెరిగిన ధరల కారణంగా చికెన్ ధరలు సైతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. సరఫరా తక్కువగా ఉండడం, డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఏపీలో తొలిసారిగా కిలో రూ.300 దాటింది. చికెన్ ధర శుక్రవారం కిలో రూ.315కి చేరింది. గత పదిరోజుల్లో ధర రూ.75 పెరిగింది. ఇటీవలి కాలంలో చికెన్‌ వినియోగం బాగా పెరిగిందని, ఫలితంగా ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 10-12 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తున్నారు. ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని, దీంతో ధరలు భారీగా పెరిగాయని పౌల్ట్రీ యజమానులు, చికెన్ వ్యాపారులు తెలిపారు.

ఈ సందర్భంగా పౌల్ట్రీ యజమాని సురేష్ మాట్లాడుతూ.. సమ్మర్ సీజన్ లో కోళ్ల పెంపకానికి చాలా సమయం పడుతుందన్నారు. కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న, నూనె లేని సోయాబీన్‌లు, వేపపిండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక దశలో స్కిన్ లెస్ చికెన్ ధర కిలో రూ.80కి పడిపోయింది. అయితే, కోవిడ్-19 రెండవ వేవ్ తర్వాత, చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక దశలో కిలో రూ.280కి చేరగా ప్రస్తుతం రూ.315కు విక్రయిస్తున్నారు. అయితే ఏడాది ప్రారంభంలో రూ.200లోపే ధర.. జనవరిలో రూ.215 ఉండగా.. మార్చి 1 నాటికి రూ.280కి పెరిగింది. మే 1 నుంచి కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. మే 13 నాటికి రూ.230 నుంచి రూ.315 కు పెరిగింది.

ధరల పెరుగుదల విక్రయాలపై ప్రభావం చూపిందని చికెన్ షాపు యజమానులు తెలిపారు. ఒకటి నుంచి రెండు కేజీల చికెన్ కొనుగోలు చేసే వారు ఇప్పుడు సగం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. “బిజినెస్ పెరగడం కోసం మేం వినియోగదారులకు కిలోకు రూ. 20 నుండి రూ. 40 వరకు రాయితీని అందిస్తున్నాం. అనేక చికెన్ దుకాణాలు కస్టమర్లను ఆకర్షించడానికి ఇటువంటి బోర్డులను ప్రదర్శిస్తున్నాయి”అని ఒక దుకాణ యజమాని చెప్పారు.

  Last Updated: 14 May 2022, 02:15 PM IST