2 Pawars-Modi Event : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన మేనల్లుడు అజిత్ పవార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది..
ఈనేపథ్యంలో వీరిద్దరూ ఆగస్టు 1న పూణేలో ఒక ప్రోగ్రాంలో పాల్గొననున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేసే ఈ కార్యక్రమంలో శరద్ పవార్, అజిత్ పవార్ కూడా పాల్గొంటారు. లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 103వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ వేడుక జరగనుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక వచ్చిన తర్వాత తొలిసారిగా అజిత్, శరద్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రధాని మోడీకి జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో కూడిన అవార్డును అందజేస్తామని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ తెలిపింది. “ప్రధానమంత్రి మోడీ పౌరులలో దేశభక్తి భావనను మేల్కొల్పారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారు. ఆయన పట్టుదల, కృషిని పరిగణనలోకి తీసుకుని ఆయనను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశాం” అని ట్రస్ట్ తెలిపింది.
Also read : Social Media Apps Down : ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. వేలాదిమంది అవస్థ
ప్రధాని మోడీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రసంగాలు
ట్రస్ట్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పూణేలో జరిగే ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇద్దరూ(2 Pawars-Modi Event) ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే కూడా అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకానున్నారు. కాగా, జూన్ 27న మధ్యప్రదేశ్ లోని భోపాల్లో భారతీయ జనతా పార్టీ బూత్ వర్కర్లతో మాట్లాడిన సందర్భంగా.. కొందరు ఎన్సీపీ నేతలు సుమారు రూ. 70,000 కోట్ల కుంభకోణాలు చేశారని మోడీ ఆరోపించారు. ఈ ఆరోపణల లిస్టులో మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం, నీటిపారుదల కుంభకోణం, అక్రమ మైనింగ్ కుంభకోణం ఉన్నాయి.