Metro Trains: మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి

  • Written By:
  • Publish Date - June 6, 2024 / 12:04 AM IST

Metro Trains: హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం, ప్రయాణికుల రద్దీ కారణంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రయాణిస్తున్న రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. పంజాగుట్ట, ఎర్రమంజిల్ స్టేషన్లలో కొద్దిసేపు రైళ్లను నిలిపివేశారు. సాంకేతిక కారణంతో మెట్రో రైళ్లను ఆపినట్లు లోకో పైలట్లు ప్రకటించారు. మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో పలువురు ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరిచి బయటికి వచ్చారు.

భారీ వర్షం, రహదారిలో ట్రాఫిక్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో హుటాహుటిన ఆ మార్గంలో ఫ్రీక్వెన్సీ పెంచారు. నిమిషానికి రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కారణంగా ఓ రైలులో తలెత్తిన సాంకేతిక సమస్యతో మిగతా రైళ్లన్నీ నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక్కో స్టేషన్‌లో 5 నుంచి 10 నిమిషాలు ఆపేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించి ప్రయాణికులకు ఇబ్బందిలేకుండా చూస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు.