ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన మోడీకి నిరసన సెగ తగిలింది. ఏపీ కాంగ్రెస్ నాయకులు పక్కా ప్రణాళికతో ఆయనకు నిరసన తెలిపారు. గాల్లోకి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన తెలిపారు, కీసరపల్లి వద్ద కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్లబెలూన్లు వదిలారు. ఆ బెలూన్లు మోడీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దగ్గరకు వెళ్లాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించిన పోలీసులు కళ్లుగప్పి కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. బెలూన్లు ఎగురవేసిన వారి ఎవరు అనేదానిపై ఆరా తీస్తున్నారు.