MLC Kavitha: జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం: ఎమ్మెల్సీ కవిత

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 01:14 AM IST

MLC Kavitha:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయి అన్నదానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ అంశంపై త్వరలో గవర్నర్ ను కలవబోతున్నట్లు ప్రకటించారు. జీవో 3కు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సాధారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఉత్సవాలు చేసుకుంటారని, కానీ ఈ సారి తెలంగాణలో పరిస్థితి వేరుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా ధర్నా చేయాల్సిన దౌర్భార్య స్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. 1996లో తెలంగాణ బిడ్డ పీవీ నరసింహా రావు దేశ ప్రధానిగా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంకా పెంచుకున్నామని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు నియామకాల్లో కూడా రిజర్వేషన్లను కల్పించిందని, మార్కెట్ కమిటీ పదవుల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల యూనివర్సిటీల్లో మహిళల సంఖ్య పెరిగిందని, మహిళలకు హాస్టళ్ల సంఖ్యను కూడా పెంచారని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో లక్షా 66 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించామని వివరించారు.

కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల నుంచి ఉన్న హక్కులను కొల్లగొట్టిందని ధ్వజమెత్తారు. నియామకాల్లో హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీం కోర్టు 2022లో తీర్పు ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు కూడా చెప్పిందని, కానీ ఆ తీర్పు అమలు చేస్తే ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి అమలు చేయబోమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తేల్చిచెప్పారని వివరించారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకుందని పేర్కొన్నారు. “ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. వ్యక్తిగత కారణాలతో మరణించిన ఆడపిల్లల ఉదంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకుంది. విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అన్యాయం చేస్తున్నది. ” అని వ్యాఖ్యానించారు. 33 శాతం రిజర్వేషన్లను హరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 3ను జారీ చేసిందని గుర్తు చేశారు.