టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవలు జరిగిన మూడు వన్డేల్లో ఘోరంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. వరుసగా డకౌట్ కావడంతో నెటిజన్స్ సూర్యపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. మూడు వన్డేల సిరీస్లో మూడు బంతులు మాత్రమే ఆడటం దురదృష్టకరమని తెలిపాడు. అయితే అతను మూడు అద్భుతమైన బంతులకు ఔటయ్యాడని వెనకేసుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మను సూర్య పేలవ ఆటతీరుపై ప్రశ్నించగా అతనికి అండగా నిలిచాడు. ప్రస్తుతం సూర్య విషమ దశను ఎదుర్కొంటున్నాడని చెప్పాడు. ‘ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ మూడు బంతులు మాత్రమే ఆడాడు. దీనిని మీరు ఎంతవరకు పరిశీలిస్తున్నారో నాకు తెలియదు. కానీ అతను మూడు అద్భుతమైన బంతులకు ఔటయ్యాడనేది వాస్తవం. మూడో వన్డేలో అతను ఎదుర్కొన్న బంతి నా దృష్టిలో గొప్పది కాదు. కానీ అతను తప్పుడు షాట్ ఎంచుకున్నాడు. ఆ బంతిని ముందుకు వచ్చి ఆడాల్సింది.
అతను స్పిన్ను సమర్థవంతంగా ఆడగలడు. అందుకే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించకుండా ఆపాము. చివరి 15-20 ఓవర్లు ఆడాల్సిన బాధ్యతను అప్పజెప్పాం. కానీ దురుదృష్టవశాత్తు అతను గోల్డెన్ డకౌటయ్యాడు. ఈ సిరీస్లో మూడు బంతులు మాత్రమే ఆడాడు. ఇది ప్రతీ ఒక్కరికి జరిగేదే. అతని సామర్థ్యం, క్వాలిటీ ఎప్పటికీ అలానే ఉంటుంది. అతనిలో సత్తా ఉంది. కేవలం మూడు మ్యాచులకే కెరీర్ ను నిర్ణయించలేమని రోహిత్ అన్నాడు. ప్రస్తుతం రోహిత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.