కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో ఆయనను ఇంట్లోంచి వెళ్లనివ్వకుండా జూబ్లీహిల్స్లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ఇంటి చుట్టూ పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని నిర్బంధాలు ఉన్నా తాను ఎర్రవెల్లికి వెళ్లి తీరతానని ఆయన చెప్పారు. ఎర్రవెల్లితో తాము నిర్వహించాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి గ్రామం నిషేధిత గ్రామమా? అంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులు తమను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఉదయం నుంచే ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తూ.. ఇంటి నుంచి ఎటు వైపు నుంచి బయటికి వచ్చినా అడ్డుకుని అరెస్ట్ చేయాలని ముందస్తు వ్యూహంతో పోలీసులు ఉన్నారు. ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను ఎక్కడికి తరలించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.