Site icon HashtagU Telugu

Hyderabad: ఇకపై హైదరాబాదులోనే విమాన ఇంజన్ల రిపేర్.. ఎప్పటికీ పూర్తికానుందో తెలుసా?

Hyderabad

Hyderabad

హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఒక్కొక్కటిగా హైదరాబాదులో టెక్నాలజీకి అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ హెల్త్ హబ్‌గా మారగా సాఫ్ట్ వేర్‌ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ ఆఫీసులను ఏర్పాటు చేసిన తరువాత ఇపుడు మరో పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కానుంది. అదే విమాన ఇంజన్లను రిపేర్‌ చేసే సంస్థ.. జీఎంఆర్‌ ఏవియేషన్‌ సెజ్‌ లో శాఫ్రాన్‌ ఎంఆర్‌వో యూనిట్‌ ఏర్పాటు కానుంది. ఇది 2024 ఏడాది చివరి నాటికి పూర్తి కానుండగా 2025 జనవరి నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ పరిశ్రమ ద్వారా నేరుగా 1000 మందికి పైగా ఉద్యోగావ అవకాశాలు రానున్నాయి. విమాన ఇంజిన్ లకు మరమ్మతులు, నిర్వహణ సేవలు అందించే కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఇందుకోసం జీఎంఆర్‌ గ్రూపు సంస్థ హైదరాబాద్‌ ఏవియేషన్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన శాఫ్రాన్‌కు భారతీయ అనుబంధ సంస్థ- శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్స్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో 23.5 ఎకరాలకు లీజు ఒప్పందం కుదుర్చుకుంది. శంషాబాద్‌లో విమానాశ్రయానికి పక్కనే జీహెచ్‌ఐఏఎల్‌కు చెందిన సెజ్‌ ప్రాంతంలో లీప్‌ టర్బోఫ్యాన్‌ ఇంజిన్ల ఎంఆర్‌ఓ సదుపాయాన్ని నిర్వహించడానికి శాఫ్రాన్‌ సిద్ధమవుతోంది.

దాదాపు 36,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కేంద్ర పనులు సెప్టెంబరులో ప్రారంభమై, 2024 చివరికి పూర్తవుతాయి. 2025 నుంచి సేవలు అందించే ఈ కేంద్రం వల్ల దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. శాఫ్రాన్‌ ఇప్పటికే జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లోని ఎస్‌ఈజడ్‌ ప్రాంతంలో కేబుల్‌ హార్నెసింగ్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ విడిభాగాల తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. జీఈ, శాఫ్రాన్‌కు చెందిన ఇంజిన్‌ నిర్వహణ శిక్షణ సదుపాయమూ కూడా ఇందులో ఉంది. హైదరాబాద్‌ ఏరోసిటీలో డొమెస్టిక్‌ టారిఫ్‌ ఏరియా కూడా ఉంది. దేశీయ సంస్థలతో పాటు పలు విదేశీ సంస్థలు ఈ ప్రాంతాల్లో యూనిట్లు నిర్వహిస్తున్నాయి. శాఫ్రాన్‌తో ఒప్పందం ఎంతో కీలకమైందని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగ సీఈఓ అమన్‌ కపూర్‌ అన్నారు. మొదటి ఏడాదిలో 100 ఇంజిన్లకు సర్వీస్‌ చేయగల సామర్థ్యంతో శాఫ్రాన్‌ ఎంఆర్‌ఓ యూనిట్‌ ఏర్పాటవుతుందట. అలాగే భవిష్యత్తులో 300 ఇంజన్లకు సామర్థ్యం విస్తరిస్తుందని అన్నారు. భారత్‌లో విస్తరణ కోసమే ఎంఆర్‌ఓ యూనిట్‌ నెలకొల్పుతున్నట్లు శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్స్‌ ఉపాధ్యక్షుడు నికోలస్‌ పోటియర్‌ వివరించారు.