Hyd Rape Case : జూబ్లిహిల్స్ లో బాలికపై అత్యాచారం కేసు… నిందితులు ప్లాన్ ప్రకారమే లైంగిక దాడికి పాల్పడ్డారా?

జూబ్లిహిల్స్ లో అమ్నీషియా పబ్ కు వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం పక్కా ప్లాన్ తోనే జరిగిందా

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 02:57 PM IST

జూబ్లిహిల్స్ లో అమ్నీషియా పబ్ కు వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం పక్కా ప్లాన్ తోనే జరిగిందా? ఎందుకంటే నిందితులు ముందుగానే ఆమె దగ్గరున్న వస్తువులు లాక్కొన్నట్టుగా తెలుస్తోంది. పబ్ లోకి వెళ్లాలంటే.. ముందుగా అక్కడ ఓ ట్యాగ్ ఇస్తారు. ఆమె బయటకు వచ్చిన తరువాత మరోసారి పబ్ లోకి వెళ్లకుండా ఉండేలా.. ఆమె చేతికున్న ట్యాగ్ ను తీసేశారు. దీంతో ఆమె పబ్ లోకి వెళ్లలేకపోయింది. తరువాత ఆమెను ఇంటి దగ్గర దించుతామంటూ బెంజ్ కారులో ఎక్కించుకున్నారు. పోలీసులు కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ బాలిక మే 28న సాయంత్రం పబ్ నుంచి బయటకు వచ్చిన తరువాత పబ్ లోనే ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో ఆ పక్కనే మాటు వేసిన ఉన్న నిందితులు.. క్యాబ్ బుక్ చేస్తామన్న నెపంతో ఆమె ఫోన్ ను తీసుకున్నారు. డేటా సరిగా పనిచేయడం లేదని.. తామే దించుతామంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నారు. అదే క్రమంలో ఆమె బ్యాగ్, స్పెక్ట్స్ కూడా తీసుకున్నారు. కారులోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె వెళ్లిపోతానని చెప్పింది. ఫోన్, బ్యాగ్, కళ్లజోడు ఇచ్చేయమంది. అయినా వారు వినకుండా ఆమెను బెదిరించి మరో వాహనంలో తీసుకెళ్లారు.

అయితే కాన్పు బేకరీ దగ్గర కారు మారే సమయంలో 15 నిమిషాలు గ్యాప్ వచ్చింది. ఆలోపు అక్కడున్న ఎవరికైనా విషయం చెప్పి సహాయం ఎందుకు అడగలేదు.. అసలు ఆ సమయంలో పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు అని ఆమెను పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. కానీ ఆ ఏరియా తనకు కొత్త అని పైగా తన వస్తువులు అన్నీ వారి దగ్గరే ఉన్నాయని.. అందుకే వేరే దారి లేక కారులోనే ఉండిపోయానని ఆ బాలిక చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే నిందితులు పక్కా ప్లాన్ తోనే ఈ దారుణానికి పాల్పడినట్టుగా కనిపిస్తోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు.