హైదరాబాద్: బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం కోసం పశువులను విక్రయించకుండా గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. పశువులను వధకు అమ్మకుండా గ్రామాలను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ను రాజాసింగ్ కోరారు. గోవులను గోమాతగా ఆరాధించే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా బక్రీద్ పండుగ రోజున ముస్లింలు గోవులను వధిస్తున్నారని రాజాసింగ్ లేఖలో ప్రస్తావించారు. గోవును వధించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి బక్రీద్ రోజున లెక్కలేనన్ని పశువులను వధించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం సీఎం కేసీఆర్ కర్తవ్యమని, బక్రీద్ రోజున మాత్రమే కాకుండా, సంవత్సరంలో 365 రోజులు కూడా గోవులను, వాటి సంతతిని అక్రమంగా వధించడాన్ని ఆపాలని బిజెపి ఎమ్మెల్యే కోరారు.