Rain Alert : ఏపీలోని 5 జిల్లాలకు.. తెలంగాణలోని 7 జిల్లాలకు వర్షసూచన

Rain Alert : వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

  • Written By:
  • Updated On - September 16, 2023 / 06:07 AM IST

Rain Alert : వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.అంతకుముందు నాలుగైదు రోజులతో పోలిస్తే ఏపీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని తెలిపింది. రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల మినహా పెద్దగా వానలు పడలేదని స్పష్టం చేసింది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 5 గంటల సమయానికి) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 50.6 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో 14.8, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 11.6, బాపట్ల జిల్లా రేపల్లెలలో 11.4, అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో 10.2, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 10, పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపూర్‌లో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది.

Also read : Breakfast Scheme : దసరా నుంచి ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్స్ కు అల్పాహారం.. కేసీఆర్ ప్రకటన

ఇక తెలంగాణలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇవాళ తెలంగాణలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో సెప్టెంబర్‌ నెలలో సాధారణ వర్షపాతానికి మించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.3 మి.మీ. ఉండగా.. ఈనెల 16వరకు రాష్ట్రవ్యాప్తంగా 150.5 మి.మీ. వర్షం (Rain Alert) కురిసింది. ఇది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 95 శాతం అధికమని హైదరాబాద్‌ వాతావరణ  కేంద్రం వివరించింది.