రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు 119 కి.మీ జరగనుంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చేట్రగుడిలో రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఈరోజు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ యాత్రకు ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు స్వాగతం పలికారు.