CM Revanth: తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం.. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం అని అన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ కు కూడా భారతరత్న రావడం సంతోషకరం అని అన్నారు.
పీవీకి భారతరత్న ప్రకటించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు అని, నైతిక విలువలు కలిగిన పండితుడని గుర్తు చేశారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరికీ గౌరవం అని అన్నారు. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా భారతరత్న ప్రదానం చేయడం జాతి గర్వించదగ్గ విషయం అని సీఎం జగన్ స్పందించారు.