కర్ణాటక (karnataka) రాష్ట్రం లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (congress Party) ఘన విజయం సాధించింది. అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. సీఎంగా సిద్ధరామయ్య (Sidda ramaiah) బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలోనే బీజేపీ (BJP) టార్గెట్ చర్యలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఈ సమయంలో జరిగిన కుంభ కోణాలపై ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ దృష్టిపెట్టింది. బీజేపీ హయాంలో కర్ణాటకలో 2021లో బిట్ కాయిన్ (Bit coin) కుంభకోణం పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అపట్లో కాంగ్రెస్ పార్టీ ఈ బిట్ కాయిన్ కుంభకోణంపై బీజేపీ ప్రభుత్వంను నిలదీసింది. మేం అధికారంలోకి వస్తే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని అప్పట్లో కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
కర్ణాటకలో 2021లో బీజేపీ హయాంలో జరిగిన బిట్కాయిన్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన శ్రీకృష్ణ రమేష్ అలియాస్ శ్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఇ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ను హ్యాక్ చేసి రూ. 11.5కోట్ల మేరకు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రిఫ్టో కరెన్సీ దొంగతనం, డ్రగ్ పెడ్లింగ్, సైబర్ ఫ్రాడ్ వంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కుంభకోణంపై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామని ఎన్నికల ముందే చెప్పిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తాజాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ.. బీజేపీ హయాంలో చోటు చేసుకున్న బిట్ కాయిన్ కుంభకోణంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు అడిషనల్ డీజీపీ మనీష్ ఖర్బీకర్ సారథ్యం వహించనున్నారు. ఈ విచారణలో భాగంగా సైబర్ పోలీసుల సహకారంకూడా తీసుకోనుంది. రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ.. 2021లో బీజేపీ హయాంలో జరిగిన బిట్ కాయిన్ కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సిట్ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఇదిలాఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకాలంలోనే గత బీజేపీ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది.