The Prime Minister Of Bharat : ‘ఇండియా’ బదులు ‘భారత్’ పదాన్ని వినియోగించి ఇటీవల భారత రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ నోటిఫికేషన్ లో ‘ప్రెసిడెంట్ ఆప్ భారత్’ అనే పదబంధాన్ని వాడారు. అయితే నెల క్రితమే (ఆగస్టులో) జరిగిన 15వ బ్రిక్స్ (BRICS) సమావేశంపై ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్లోనూ ‘ఇండియా’ బదులు ‘భారత్’ అనే పదాన్ని వాడారని తాజాగా జాతీయ మీడియాలో ఇవాళ కథనాలు వచ్చాయి. ఆ నోటిఫికేషన్ లో ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని ప్రస్తావించారు. వారం క్రితమే జరిగిన ప్రధాని మోడీ గ్రీస్ పర్యటనకు సంబంధించిన నోటిఫికేషన్ లో కూడా అలాగే వాడారు.
నేటి నుంచి జరగనున్న తూర్పు ఆసియా సదస్సు, ఇండోనేషియాలో ఏషియన్ ఇండియా సదస్సులలోనూ ప్రధాని మోడీ పాల్గొననున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లలో కూడా ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అనే పదాన్నే వాడారు. ఇక ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ-20 సదస్సుకు సంబంధించిన బుక్ లెట్ లలోనూ ఇండియాకు బదులు భారత్ అని ముద్రించారు.రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఇండియా అని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, దీనిపై పార్లమెంటులో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నో ప్రజా సమస్యలున్న ప్రస్తుత తరుణంలో.. దేశం పేరుపై కంటే దేశం పేరును మంటగలిపేలా చోటుచేసుకుంటున్న మణిపూర్ హింసాకాండ వంటి ఘటనలపై ప్రధాన చర్చ జరగాలని సమాజ సేవకులు (The Prime Minister Of Bharat) సూచిస్తున్నారు.