1975 Emergency: దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రధాని హయాంలో అంటే 1975వ సంవత్సరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో దేశం అల్లకల్లోకం అయింది. ఇందిరా గాంధీ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఆనాటి రాజకీయ నేతల అరెస్టులు, పోలీసులు లాఠీ, ఉద్యమాలతో దేశం అట్టుడికిపోయింది. అయితే ఈ ఎమర్జెన్సీని ఎందరో వ్యతిరేకించి తమ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఎమర్జెన్సీ సమయంలో నిరసన తెలిపిన నేతలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో నిరసన తెలిపిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులు మన చరిత్రలో మరచిపోలేని రోజులుగా వర్ణించారు. ఇవి మన రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మాట్లాడుతూ… ఎమర్జెన్సీని ఎదిరించి, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు కృషి చేసిన ధైర్యవంతులందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. ఎమర్జెన్సీ చీకటి రోజులు మన చరిత్రలో మరచిపోలేని ఘట్టం, మన రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. దీంతో పాటు ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. 1975 జూన్ 25న నియంతృత్వ పోకడల కారణంగా ఓ కుటుంబం దేశంలోని గొప్ప ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఎమర్జెన్సీ విధించిందని అన్నారు.