కరోనా కారణంగా తల్లిదండ్రుల మరణించి అనాథులైన 3481 మంది చిన్నారులకు ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్’ పథకం అండగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 24 నాటికి మొత్తం 6 వేల 98 దరఖాస్తులు అందగా.. వాటిలో 3వేల 4 వందల 81 అప్లికేషన్లను జిల్లా మెజిస్ట్రేట్లు ఆమోదించినట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికే 3275 మందికి పోస్ట్ఆఫీస్ ఖాతాలు కూడా తెరిచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకంలో భాగంగా సంరక్షణ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు నెలకు 2వేల 160 రూపాయల చొప్పున..మరోవైపు స్వతంత్రంగా నివసిస్తున్న పిల్లలకు నెలకు 2 వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 704 సఖి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. డిసెంబరు 24 నాటికి వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న 54 లక్షలపైగా మహిళలకు సాయం అందించినట్టు వివరించింది.