ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం రైతు వేదికలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, స్థానిక ఎమ్మెల్యేల ఫొటోలు, బ్యానర్స్ ఉండటాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం అందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) నిధుల సహాయంతో నిర్మాణ పనులు జరిగాయని పేర్కొన్నారు. సోమవారం తలమడుగు, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పనులను బృందం పరిశీలించింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 22 లక్షల రూపాయలను కేటాయించిందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు పెట్టడం లేదని పలువురు టీఆర్ఎస్ నాయకులు అధికారులకు తెలిపినట్లు సమాచారం.