పెట్రోల్ డీజీల్ ధరలు నియంత్రణకావడం లేదు. గత రెండువారాల్లో 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ రోజు (ఎప్రిల్ 5న) 80 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో.. ఢిల్లీలో ఈ రోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.104.61, డీజిల్ ధర లీటరుకు రూ.95.87గా ఉన్నాయి. 80 పైసలు పెరిగింది). ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 119.67 (పెరిగిన 84 పైసలు) డీజీల్ ధర రూ. 103.92 (పెరిగిన 85 పైసలు) వద్ద ఉన్నాయి. మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది 13వ సారి.
ఇంధన ధరలు క్రమంగా పెరుగుతుండడం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కారం చూపాలని కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ ఇంధన ధరలకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం మీద ఆందోళన చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని.. ఈ ప్రభుత్వం నుండి మేము ఆశిస్తున్నది చర్చలు, పరిష్కారమన్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఇది జరపడంలేదన్నారు. ఇంధన ధరల పెంపు వంటి సామాన్య ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రతిపక్షాలు పార్లమెంటులో లేవనెత్తినప్పుడల్లా ప్రభుత్వం చర్చకు బదులు సభను వాయిదా వేస్తోందని వేణుగోపాల్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం కనికరం లేనిదని..క్రూరంగా మారిందన్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి.. తాము పార్లమెంట్ హౌస్లో వాయిదా తీర్మానం ఇచ్చామని, ముఖ్యంగా ఎరువులు ధరల పెరుగుదలపై, కానీ వారు దానిని ప్రస్తావించడానికి కూడా అనుమతించడం లేదన్నారు.