Ration cards: ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ మాత్రమే అందిస్తోంది. ఈ పథకాలన్నీ రేషన్ కార్డు ఉన్నవారికే అందిస్తోంది. దీంతో అర్హత ఉండి రేషన్ కార్డు లేనివారు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ సర్కార్ పేదలకు కొత్త రేషన్కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయినా లక్షల మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది కార్డు కావాలని కోరుకుంటున్నారు.
గడిచిన పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. దీంతో కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంత మందికి కార్డులు ఇస్తారు. అర్హతలు ఏంటి, ప్రమాణాలు ఎలా నిర్ణయిస్తారు అన్న చర్చ జరుగుతోంది.ఇక ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కారు ఉన్నవారు, ఇన్కం ట్యాక్స్ చెల్లించేవారికి కొత్త రేషన్కార్డులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై టీకాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం ఉంది.