జనసేన అధినేత పవన్ కళ్యాణ్… నేడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరై, ప్రసంగించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో… పార్టీ నేతలు సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గతంలోనే ఈ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసినా.. కరోనా కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ బహిరంగ సభలో పాల్గొనేందుకు జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. మత్స్యకారులకు సంబంధించిన అంశాలను ప్రధానంగా పవన్ ప్రస్తావించనున్నారు.
జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ వస్తున్నారు జనసేనాని పవన్. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే… పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారాయన. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన కమిటీలను ప్రకటిస్తూ వస్తున్నారు. మిగిలిన అన్ని కమిటీలను కూడా అతి త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇకపోతే, జగన్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో… ఆయన పాలన ఎలా ఉందో అనేది ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.
మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217 ను రద్దు చేయాలని ఎప్పటినుంచో జనసేన డిమాండ్ చేస్తోంది. ఇవాళ నరసాపురంలో జరిగే బహిరంగ సభలో పవన్ మరోసారి ఇదే విషయమై గళమెత్తనున్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించేలా, వారికి వృత్తిపరమైన ఉపాధికి భరోసా ఇచ్చేలా చూడాల్సిందిగా జగన్ సర్కాన్ ను మరోసారి పవన్ డిమాండ్ చేయనున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడంలో సమయం, ఆలచన రెండూ లేవంటూ… ఫిబ్రవరి 13 నుంచి మత్స్యకారుల కోసం జనసేన పార్టీ మత్స్యకార అభ్యన్నతి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.