ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదని తెలిపారు.
ఫిట్మెంట్, గత హెచ్.ఆర్.ఏ. కొనసాగింపు, అశుతోష్ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసిందన్నారు. ఇవేవీ నెరవేరకుండానే… ఐ.ఆర్. హెచ్.ఆర్.ఏ., క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీని పాక్షికంగా చేసినా సరే సమ్మె ఉపసంహరించుకొని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పి.ఆర్.సి. స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించింది. ఈ ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని, వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకొంటుంది. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగవర్గం పట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.