ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శివాలయం పైభాగం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. స్థానికులకు ప్రసాదం పంపిణీ చేస్తుండగా ఆలయ వరండా పైకప్పు కూలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలయంలోనిపై కప్పు కూలిందని తెలిపారు. అయితే అప్పటికే ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం.. దానికి తోడు వర్షాలు భారీగా కురవడంతో వరండా పైకప్పు కూలిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆగ్రాలోని షాహ్గంజ్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించామని ఆగ్రా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) సూరజ్ కుమార్ రాయ్ చెప్పారు. ఈ ప్రమాదంలో శిథిలాలలో చిక్కుకున్న తొమ్మిది మందిని రక్షించి నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల జ్యోతి అనే మహిళ తీవ్ర గాయాలతో మరణించిందని తెలిపారు.