ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వార్త సంచలనంగా మారింది. అదేమిటంటే రెండువేల నోటును రద్దు చేయడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో రెండు వేల నోట్లు ఉన్నవారు ఎలా మార్చుకోవాలి ఎక్కడికి వెళ్లాలి ఏవైనా ఫామ్ ఫిల్ అప్ చేయాలా ఇలా అనేక రకాల అనేక సందేహాలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే నోట్లను మార్చుకునే సమయంలో ఫారం నింపాల్సి ఉంటుందని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ఏదైనా గుర్తింపు ధ్రవపత్రాన్ని కూడా సమర్పించాలని కొందరు అంటున్నారు.
కాగా తాజాగా వీటిపై బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతనిచ్చింది. రూ.2,000 నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన అవసరం లేదు అని ఎస్బీఐ స్పష్టం చేసింది. అయితే రోజుకి రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని తెలిపింది. అలాగే ఎలాంటి ఐడీ ప్రూఫ్ కూడా ఇవ్వ వలసిన అవసరం లేదని తెలిపింది. నోట్ల మార్పిడి సమయంలో రిక్విజషన్ ఫారం నింపాల్సి ఉంటుందని దానికి ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డులు ప్రూఫ్గా సమర్పించాల్సి ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పడేసింది ఎస్బిఐ.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్బీఐ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు అన్ని బ్యాంకు శాఖలకు ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.2,000 నోటును ఉపసంహరిస్తూ శుక్రవారం ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నోట్లు ఉన్న ప్రజలు వాటిని ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వెల్లడించింది. క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.